బాబూ! సీబీఐ విచారణ వద్దంటూ...చిదంబరం కాళ్లపైపడ్డావ్

print this page

 అందుకు ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని సుజనాచౌదరి గెస్ట్‌హౌసే వేదిక
చంద్రబాబుది ఓ బతుకు, ఆయనదో పార్టీయా?
అలాంటి లతుకోరుగాడు, నయ వంచకుడు రాజకీయాల్లోనే లేడు
బాబు, ఆయన ఊరకుక్కలవి కారుకూతలు
పిచ్చిమాటలు ఆపకుంటే వారిని తరిమికొడతాం
బాబు నీతి నేతిబీర.. అన్ని కోట్లు ఆయనకెక్కడివి..
ఆయన బండారం వరుసగా బయట పెడతా
మూణ్నెల్లకే మూతబడ్డ బుడ్డరఖాన్ దేవేందర్‌గౌడ్
రెండెకరాల అమ్మణ్ణమ్మకు అన్ని లక్షలెక్కడివి?

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ‘ఆయన వంటి లతుకోరు, నయవంచకుడు, మోసగాడు రాజకీయాల్లోనే లేడంటూ దుమ్మెత్తిపోశారు’. ‘తనపై సీబీఐ విచారణ, కేసులు పెట్టొద్దంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం కాళ్లపై పడ్డడు బాబు’ అని వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో సుజనాచౌదరి గెస్ట్‌హౌస్‌లో చిదంబరాన్ని కలిసి కాళ్లు మొక్కిండు. ఈసంగతి ఎవరికి తెల్వదు?’ అంటూ ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మండి పడ్డారు. రానున్న ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు పోతాయని వస్తున్న సర్వే నివేదికలతో బాబు, ఆయన తొట్టిగ్యాంగ్‌కు కాళ్లకింది భూమి కదిలిపోతోందని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు ఎంత లతుకోరుగాడంటే.. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని కూడా టీడీపీ నేతలకు బి ఫారాలిచ్చి గందరగోళం చేసిండు. వాడు ద్రోహి. 2009లో సీఎం కావడానికి అవకాశాలుండి కూడా, నమ్మినవారినే మోసం చేసే నీచబుద్ధ్ది, నిజాయితీ లేనితనం వల్ల తినే కూటిలో మట్టి పోసుకున్నడు. చంద్రబాబు వంటి లంగ మేనేజ్‌మెంట్లు నాకు రావు. బాబును 2004లోనే జనం బొందపెట్టిండ్రు. ఆ బొంద నుంచి ఎప్పటికీ లేవడు. 

ఈ మొగోడా రాష్ట్రాన్ని రక్షించేది? టీఆర్‌ఎస్ బొందపెడితే బయటకు రాలేనోడు బాబు, అదే టీఆర్‌ఎస్‌ను బొందపెడ్తడా? అయినా రాష్ట్రం ఉంటదా? ఏప్రిల్‌లో మహోద్యమం తెచ్చి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధిస్తం. ఇంకా సీఎం అయితనని బాబు పగటికలలు కంటున్నడు. ఇలాంటి బాబుది ఒక బతుకు, ఆయనదో పార్టీ.. ఛీ’ అంటూ ఛీత్కరించారు. ‘తొమిదేళ్లు సీఎంగా, ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షస్థానంలో ఉన్నా సంస్కారం, హుందాతనం లేకుండా బాబు కుట్రలు చేస్తున్నడు. నాగంతో సహా ఉప ఎన్నికలు జరిగే ఆరు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో గెలుస్తం. 

అది చూసి తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటదని బాబుకు అర్థమైంది. తెలంగాణ రావడం ఇష్టం లేక, సంస్కారాన్ని, స్థాయిని మరచి తన తొట్టిగ్యాంగ్‌తో కుక్కల కన్నా నీచంగా మొరిగిస్తున్నడు. తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాని బాబు, ఆయన ఊరకుక్కలు ఇప్పుడు ఉపఎన్నికలకోసం నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నరు. తప్పుడు ప్రచారంతో కేసీఆర్‌కు ఓట్లు తగ్గించాలని కుట్రలు చేస్తున్నరు. ద్రోహులంతా కొత్తకొత్త దొంగ వేషాలతో, బహురూపుల మాటలతో వస్తరు. తస్మాత్ జాగ్రత్త! తెలంగాణ కోసం కొట్లాడుతనని తుపాకీ రామునిలా ఫోజులు కొట్టిన దేవేందర్‌గౌడ్ బుడ్డర్‌ఖాన్‌లా మూడునెలలకే దుకాణం మూసేసిండు. ఎర్రబెల్లిని ఇప్పటికే విద్యార్థులు తరిమితరిమి కొట్టిండ్రు. వచ్చిన తెలంగాణను దొంగ రాజీనామాల కుట్రలతో అడ్డుకున్న ప్రధాన శత్రువు, కారకుడు బాబే’ అని కేసీఆర్ విమర్శించారు.

అన్ని కోట్లెక్కడివి బాబూ?: అవినీతికి ఆద్యుడు చంద్రబాబని కేసీఆర్ మండిపడ్డారు. రెండెకరాల భూమి ఉన్న బాబు తల్లి అమ్మణ్ణమ్మకు లక్షలు ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత ఎక్కడిదని ప్రశ్నించారు. ‘హైదరాబాద్ మదీనగూడలో రూ. 50 లక్షలు పెట్టి అమ్మణ్ణమ్మ భూమి కొన్నారు. జూబ్లీహిల్స్‌లో రూ.19 లక్షలతో ఇంటి జాగా కొన్నరు. వాటిని బాబు కొడుకు లోకేశ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని వివరించారు. సంబంధించిన డాక్యుమెంట్లు, రుజువులను విలేకరులకు చూపించారు. ‘రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకున్న బాబు తల్లికి ఈ లక్షలన్నీ ఎక్కడి నుంచి వచ్చినయి? లోకేశ్ చదువుకు రూ.22 కోట్లు ఖర్చు పెట్టానని బాబు చెప్తున్నడు. ఆ డబ్బులెలా వచ్చినయి? వాటికి ఆదాయపు పన్ను కట్టిండా? బాబు, అమ్మణ్ణమ్మ ఈ డబ్బులన్నింటినీ ఏ బ్యాంకు నుంచి డ్రా చేసుకున్నరు? కుక్కల్లా నోటికొచ్చినట్లు మొరుగుతున్న బాబు, తొట్టిగ్యాంగ్‌కు దమ్ములుంటే వీటికి జవాబు చెప్పాలి. బాబు భార్యపేరు మీద కూడా లెక్కలేనని ప్లాట్లు, ఆస్తులున్నయి. బాబు బండారం వరుసపెట్టి బయటపెడ్త’ అని కేసీఆర్ హెచ్చరించారు. నేతి బీరకాయలో నేతెంతో బాబులోని నీతీ అంతేనని ఎద్దేవా చేశారు. ‘బాబు నీతిమంతుడైతే, ఆయన హయాంలో సీఎం పదవిని లోకాయుక్త పరిధిలోకి తేవాలంటే ఎందుకు పారిపోయిండు? సీబీఐ విచారణకు ఎందుకు భయపడ్డడో, సాంకేతిక కారణాలు చూపి విచారణపై ఎందుకు స్టే తెచ్చుకున్నడో చెప్పాలె. లేదంటే బాబు ఈ పాటికే జైలులో ఉండేవాడు. పిచ్చి మాటలు ఆపకుంటే బాబును, ఆయన తొట్టిగ్యాంగ్‌ను తరిమికొడతార’ని హెచ్చరించారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...